
ఏడాది కొందరు మహిళా నేతలు సంచలన విజయాలను నమోదు చేయగా, కొందరు ప్రముఖ మహిళలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లోకి ఎక్కారు. పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు తెరదించి ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు.
తెల్లచీరలో, రబ్బరు చెప్పులతో సాదాసీదాగా కనిపించే ‘దీదీ’ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కీర్తి దక్కించుకున్నారు. పథకం ప్రకారం ఈ ‘ఫైర్ బ్రాండ్’ చేసిన ఎదురుదాడిలో కాకలు తీరిన కమ్యూనిస్టు
నేతలు సైతం పరాభవం చవిచూశారు. తమిళనాడులో వరసగా రెండు సాధారణ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అన్నాడిఎంకె నాయకురాలు జయలలిత తన ప్రచార వ్యూహాన్ని కొత్త పుంతలు తొక్కించి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. చిరకాల ప్రత్యర్థి అయిన డిఎంకెను చావుదెబ్బ తీసి ఆమె మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 199 సీట్లు సాధించి, డిఎంకెకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి జయలలిత తన ప్రతీకారం తీర్చుకున్నారు.
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంపై ఈ ఏడాది దేశంలో పలు వదంతులు చోటుచేసుకున్నాయి. ఆమె కొన్ని నెలల పాటు న్యూయార్క్ ఆస్పత్రిలో ఉంటి వైద్య చికిత్స చేయించుకున్నారు. సోనియా అనారోగ్యం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చింది. విదేశీ మీడియా ప్రకటించేవరకూ ఆమె అనారోగ్యంపై వాస్తవాలు దేశ ప్రజలకు తెలియకపోవడం విశేషం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎం.కరుణానిధి గారాలపట్టి కనిమొళి ‘2జి-స్ప్రెక్ట్రం’ కుంభకోణంలో కారాగార వాసాన్ని చవిచూడడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేల కోట్ల రూపాయల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మై 20న జైలు పాలైన కనిమొళికి కొద్ది రోజుల క్రితమే బెయిల్ మంజూరైంది.
‘కాన్పు’పై బెట్టింగులు..
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్య రాయ్ తొలి కాన్పుపై దేశ వ్యాప్తంగా ‘బెట్టింగ్’లు చోటుచేసుకోవడం విశేషం. ఈమె కాన్పుకు సంబంధించి ‘సంయమనం’ పాటించాలంటూ మీడియాకు ఆంక్షలు విధించడం మరో విడ్డూరం. 11-11- 2011న ఐశ్వర్య ప్రసవిస్తుందన్న వార్తా కథనాలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె 16-11-2011న ఆడ శిశువుకు జన్మనివ్వడంతో వేలం వెర్రి బెట్టింగులకు, తలాతోక లేని కథనాలకు తెర పడింది.
మాట తప్పిన ‘పూనం’
2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్ జట్టు గెలిస్తే తాను స్టేడియంలో నగ్నంగా తిరుగుతానని ‘మత్తెక్కించే’ హామీ ఇచ్చిన ప్రముఖ మోడల్ పూనం పాండే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరల్డ్ కప్ను మన ఆటగాళ్లు సాధించినా, పూనం హామీ మాత్రం నెరవేరలేదు. యువతను తప్పుదారి పట్టిస్తోందని ఈమెపై పలు కేసులు నమోదయ్యాయి. పూనం మాట తప్పిందని ఆగ్రహించిన కుర్రకారుకు ఆ తర్వాత నెట్లో ఆమె ‘బాత్రూం’ దృశ్యాలు కొంత ఊరటనిచ్చాయి. అశ్లీల వెబ్సైట్లను ప్రభుత్వం అనుమతించాలంటూ వాదిస్తున్న ఈ భామ ఇటీవల తన సొంత వైబ్సైట్ను ప్రారంభించింది.
శ్రీలక్ష్మిపై కేసులు..
మొదట్లో మంచి ఐఎఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్న ఎర్రా శ్రీలక్ష్మిపై ఓబుళాపురం గనుల కుంభకోణానికి సంబంధించి సిబిఐ కేసులు పెట్టడం రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. సిబిఐ అరెస్టు చేయడంతో కొన్ని రోజులపాటు జైలులో ఉన్న ఈమెకు ఆ తర్వాత బెయిల్ లభించింది.
సుదీర్ఘ నిరాహార దీక్ష..
‘ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్’గా ఖ్యాతిగాంచిన షర్మిల చాను చేస్తున్న నిరాహార దీక్షకు పదకొండేళ్లు పూర్తి కావడం దేశంలో సంచలనం సృష్టించింది. మణిపూర్లో ప్రత్యేక అధికారాలున్న సాయుధ దళాలను ఉపసంహరించాలని ఈమె 2000 నవంబర్లో నిరాహార దీక్ష ప్రారంభించింది. సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేస్తున్న మహిళగా చాను ప్రపంచవ్యాప్తంగా కీర్తి సాధించింది.
ఇక, బాలీవుడ్ నటి విద్యా బాలన్ ‘ద డర్టీ పిక్చర్’లో తన అందచందాలను ప్రదర్శించి వివాదాలను, కోర్టు కేసులను ఎదుర్కొంది. దివంగత నటి సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా నిర్మించిన ‘ద డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తన అద్వితీయ నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ (79) సుదీర్ఘ అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్ను మూసింది. ఎనిమిది వివాహాలు చేసుకున్న టేలర్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఎయిడ్స్ నివారణకు అంతర్జాతీయ స్థాయిలో విశేష కృషి చేసి తన సామాజిక బాధ్యతను చాటుకుంది.
ప్రపంచంలోనే పొట్టి మహిళ..
మహారాష్టల్రోని నాగపూర్కు చెందిన జ్యోతి ఆమ్గే (18) ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకుంది. కేవలం 62.8 సెంటీమీటర్ల పొడవున్న ఈమె కొద్ది రోజుల క్రితమే గిన్నిస్ రికార్డు సాధించినట్లు ధృవపత్రాన్ని పొందింది. అమెరికా మహిళ బ్రిడ్జెట్ జోర్డాన్ (69.49 సెంటీమీటర్లు) రికార్డును అధిగమించిన జ్యోతి ‘ఆకాండ్రోప్లాసియా’ అనే వైద్య సమస్య కారణంగా పొడవుగా ఎదగలేక పోయింది.